1సమూయేలు
అధ్యాయం 7
అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మందసమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి.
మందసము కిర్యత్యారీములోనుండిన కాలము ఇరువై సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా
సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను మీ పూర్ణహృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.
అంతట ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి.
అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా
వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.
ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి
మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవిచేసిరి
సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగబలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.
సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయులచేత ఓడిపోయిరి.
ఇశ్రాయేలీయులు మిస్పాలోనుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి.
అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు1 అను పేరు పెట్టెను.
ఈలాగున ఫిలిష్తీయులు అణపబడినవారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగిరాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను.
మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్దనుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగివచ్చెను. ఎక్రోనునుండి గాతువరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలోనుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను.
సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.
మరియు అతని యిల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.