పవిత్ర గ్రంథాలు

ఎస్తేరు

అధ్యాయం 8

ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణియైన ఎస్తేరునకిచ్చెను ఎస్తేరు మొర్దెకై తనకు ఏమికావలెనో రాజునకు తెలియజేసినమీదట అతడు రాజు సన్నిధికి రాగా

రాజు హామానుచేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటిమీద అధికారిగా ఉంచెను.

మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవిచేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా

రాజు బంగారు దండమును ఎస్తేరుతట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి

రాజవైన తమకు సమ్మతియైనయెడలను, తమ దృష్టికి నేను దయపొందినదాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచినయెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనము చేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.

నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవిచేయగా

రాజైన అహష్వేరోషు రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఈలాగు సెలవిచ్చెను హామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను; అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను.

అయితే రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు; కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి.

సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషు దేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలో నున్న అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.

రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీదులను వారిచేత పంపెను.

రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆ యా ప్రదేశములలో నుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశువులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూలపరచి

వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.

మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆ యా సంస్థానములలోని జనులకందరికి పంపించవలెననియు, యూదులు తమ శత్రువులమీద పగతీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను.

రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాటవలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.

అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపువర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజు సముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషమొందెను.

మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.

రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభదినమని విందు చేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.