యెషయా
అధ్యాయం 8
మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసికొని మహేరు షాలాల్, హాష్ బజ్1, అను మాటలు సామాన్యమైన అక్షరములతో దానిమీద వ్రాయుము.
నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా
నేను ప్రవక్త్రియొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్ బజ్2 అను పేరు పెట్టుము.
ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కుయొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడుసొమ్మును ఎత్తికొని పోవుదురనెను.
మరియు యెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను
ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.
కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటిమీదను పొర్లిపారును.
అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును.
జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.
ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.
ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను
ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.
సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.
అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును
అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లుచేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.
ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.
యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసికొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను.
ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
వారు మిమ్మును చూచి కర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్లదగునా?
ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్య ప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.
అట్టివారు ఇబ్బందిపడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు;
భూమి తట్టు తేరిచూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.