యోబు
అధ్యాయం 1
ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు.
అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.
అతనికి ఏడువేల గొఱ్ఱలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.
అతని కుమారులందరు వంతులచొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందుచేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.
వారి వారి విందు దినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.
దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది2 యగువాడు వారితో కలిసి వచ్చెను.
యెహోవా నీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిమీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.
అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటి వాడెవడును లేడు.
అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?
నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.
అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా
యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలువెళ్లెను.
ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానము చేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి
ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొనిపోయి
ఖడ్గముతో పనివారిని హతముచేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశమునుండి పడి గొఱ్ఱలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీద పడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా
గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యౌవనుల మీద పడినందున వారు చనిపోయిరి; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను
నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగివెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.
ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.