యోనా
అధ్యాయం 1
యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.
అయితే యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను.
కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢనిద్ర పోయియుండెను
అప్పుడు ఓడనాయకుడు అతనియొద్దకు వచ్చి, ఓయీ నిద్రబోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను.
అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.
కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా
అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై యున్నాను.
తాను యెహోవా సన్నిధిలోనుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసియుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.
అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుపాను అధికమౌచున్నది, సముద్రము మామీదికి రాకుండ నిమ్మళించునట్లు మేము నీకేమి చేయవలెనని అతని నడుగగా యోనా
నన్ను బట్టియే యీ గొప్పతుపాను మీమీదికి వచ్చెనని నాకు తెలిసియున్నది; నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పినను
వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలముచేత సముద్రము పొంగియుండుటవలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను.
కాబట్టి వారు యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి; ఈ మనుష్యునిబట్టి మమ్మును లయము చేయకుందువు గాక; నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవిచేసికొని
యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.
ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.
గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను.