మత్తయి
అధ్యాయం 22
యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమానరీతిగా ఇట్లనెను.
పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లివిందు చేసిన యొక రాజును పోలియున్నది.
ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.
కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లివిందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని
వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి.
తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.
కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.
అప్పుడతడు పెండ్లివిందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు.
గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లివిందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.
ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడినవారినందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లిశాల నిండెను.
రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి
స్నేహితుడా, పెండ్లివస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియై యుండెను.
అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.
కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.
అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు
బోధకుడా, నీవు సత్యవంతుడవైయుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.
నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి.
యేసు వారి చెడుతనమెరిగి వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు?
పన్ను రూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము తెచ్చిరి.
అప్పుడాయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారు కైసరువనిరి.
అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.
వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి.
పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయనయొద్దకు వచ్చి
బోధకుడా, ఒకడు పిల్లలులేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే చెప్పెను;
మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.
రెండవవాడును మూడవవాడును ఏడవవానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.
అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెనుగదా అని ఆయనను అడిగిరి.
అందుకు యేసు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.
పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసికొనరు, పెండ్లికియ్యబడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు.
మృతుల పునరుత్థానమునుగూర్చి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?
ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను.
జనులది విని ఆయన బోధకాశ్చర్యపడిరి.
ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడివచ్చిరి.
వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు
బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.
అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే.
ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.
ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.
ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి
క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి.
అందుకాయన ఆలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు
నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు?
దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా
ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.