పవిత్ర గ్రంథాలు

దానియేలు

అధ్యాయం 6

తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను.

వారిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ యధిపతులు తప్పకుండ వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.

ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దేశించెను.

అందుకా ప్రధానులును అధిపతులును రాజ్యపాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయిరి.

అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి.

కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక.

రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినముల వరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవునియొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, యీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి

మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవి చేసిరి.

కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.

ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి యుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.

ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి

రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమునుబట్టి రాజా, ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను.

అందుకు వారు చెరపట్టబడిన యూదులలో నున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి.

రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసికొని, సూర్యుడస్తమించు వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను.

ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసికొనవలెననిరి.

అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.

వారు ఒక రాయి తీసికొనివచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలునుగూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి.

అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగనియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.

తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను.

అతడు గుహ దగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను.

అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక.

నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.

రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు.

రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను.

అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆ యా భాషలు మాటలాడువారికిని ఈలాగు వ్రాయించెను మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక.

నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును.

ఆయన విడిపించువాడును రక్షించువాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.

ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్థిల్లెను.