నిర్గమకాండము
అధ్యాయం 4
అందుకు మోషే చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా
యెహోవా నీచేతిలోనిది ఏమిటి అని అతనినడిగెను. అందుకతడు కఱ్ఱ అనెను.
అప్పుడాయన నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దానినుండి పారిపోయెను.
అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను.
ఆయన దానిచేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను.
మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.
తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.
మరియు ఆయన వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయినయెడల రెండవ దానిబట్టి విందురు.
వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయినయెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.
అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటిమాంద్యము నాలుకమాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా
యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.
కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.
అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచినవానినే పంపుమనగా
ఆయన మోషేమీద కోపపడి లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;
నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను.
అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.
ఈ కఱ్ఱను చేతపట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను.
అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్లి సెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా ఇత్రో - క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను
అంతట యెహోవా నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లుమని మిద్యానులో మోషేతో చెప్పగా,
మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తనచేత పట్టుకొనిపోయెను.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనియ్యడు
అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;
నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంపనొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.
అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా
సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను.
అప్పుడు ఆమె ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.
మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దుపెట్టుకొనెను.
అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.
తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి,
యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి.
మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.