పవిత్ర గ్రంథాలు

నిర్గమకాండము

అధ్యాయం 40

మరియు యెహోవా మోషేతో ఇట్లనెను

మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.

అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను.

నీవు బల్లను లోపలికి తెచ్చి దానిమీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను.

సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను.

ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను;

ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.

తెరలచుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను.

మరియు నీవు అభిషేకతైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును.

దహనబలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధమగును.

ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాని ప్రతిష్ఠింపవలెను.

మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి

అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను.

మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి

వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను.

మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.

రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను.

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి

మందిరముమీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేసెను.

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.

మందిరములోనికి మందసమును తెచ్చి కప్పుతెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తరదిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి

యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణదిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి

యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను.

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర యెదుట బంగారు ధూపవేదికను ఉంచి

దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను.

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి

దానిమీద దహనబలినర్పించి నైవేద్యమును సమర్పించెను.

మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.

దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.

వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును బలిపీఠమునకు సమీపించునప్పుడును కడుగుకొనిరి.

మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.

అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.

ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.

మేఘము మందిరము మీదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి.

ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లనియెడల అది వెళ్లు దినమువరకు వారు ప్రయాణము చేయకుండిరి.

ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరముమీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.