పవిత్ర గ్రంథాలు

ఆదికాండము

అధ్యాయం 13

అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడ నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్లెను.

అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను.

అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి

తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.

అబ్రాముతో కూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱలు గొడ్లు గుడారములు ఉండెను గనుక

వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై యుండెను.

అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.

కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు.

ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లినయెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా

లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమై యుండెను.

కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి.

అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసికొనెను.

సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి.

లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోట నుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము;

ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.

మరియు నీ సంతానమును భూమిమీద నుండు రేణువులవలె విస్తరింప చేసెదను; ఎట్లనగా ఒకడు భూమిమీద నుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును.

నీవు లేచి యీ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.

అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూరవృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.