పవిత్ర గ్రంథాలు

ఆదికాండము

అధ్యాయం 29

యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.

అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱల మందలు మూడు పండుకొనియుండెను; కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు; ఒక పెద్ద రాయి ఆ బావిమీద మూతవేసి యుండెను

అక్కడికి మందలన్నియు కూడి వచ్చునప్పుడు బావిమీదనుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱలకు నీళ్లుపెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు.

యాకోబు వారిని చూచి అన్నలారా, మీరెక్కడివారని అడుగగా వారు మేము హారానువారమనిరి.

అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.

మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు; ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱలవెంట వచ్చుచున్నదని చెప్పిరి.

అతడు ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయు వేళకాలేదు, గొఱ్ఱలకు నీళ్లు పెట్టి, పోయి వాటిని మేపుడని చెప్పగా

వారు మందలన్నియు పోగుకాక మునుపు అది మావలన కాదు, తరువాత బావిమీదనుండి రాయి పొర్లించుదురు; అప్పుడే మేము గొఱ్ఱలకు నీళ్లు పెట్టుదుమనిరి.

అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱల మందను తోలుకొని వచ్చెను; ఆమె వాటిని మేపునది.

యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీదనుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని యెలుగెత్తి యేడ్చెను.

మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు,

రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను.

లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దుపెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.

అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు అనెను. అతడు నెల దినములు అతనియొద్ద నివసించిన తరువాత

లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను.

లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు.

లేయా జబ్బు కండ్లు గలది; రాహేలు రూపవతియు సుందరియునై యుండెను.

యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.

అందుకు లాబాను ఆమెను అన్యుని కిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్ద ఉండుమని చెప్పగా

యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.

తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా

లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరిని పోగుచేసి విందు చేయించి

రాత్రివేళ తన కుమార్తెయైన లేయాను అతనియొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.

మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.

ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.

అందుకు లాబాను పెద్దదానికంటె ముందుగా చిన్నదానినిచ్చుట మాదేశ మర్యాదకాదు.

ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా

యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.

మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.

యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.

లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.

లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.

ఆమె మరల గర్భవతియై కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడ నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.

ఆమె మరల గర్భవతియై కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను

ఆమె మరల గర్భవతియై కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.