1రాజులు
అధ్యాయం 10
షేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు, సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని, గూఢార్థముగల మాటలచేత అతనిని శోధించుటకై వచ్చెను.
ఆమె గొప్ప పరివారముతో, గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనముచేసి తనకు తోచినదాని నంతటినిబట్టి అతనితో మాటలాడగా
ఆమె వేసిన ప్రశ్నలన్నిటికి సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను.
షేబరాణి సొలొమోనుయొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును,
అతని బల్లమీదనున్న భోజనద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె నందించువారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచి విస్మయమొందినదై
రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే;
అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి;
నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు
నీయందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతిన్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను.
మరియు ఆమె రాజునకు రెండువందల నలువది మణుగుల బంగార మును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధ వర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు.
మరియు ఓఫీరు దేశమునుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరునుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను.
ఈ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను, గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు.
సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబ దేశపు రాణికిచ్చినది పోగ ఆమె కోరిన ప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగా ఆమె కిచ్చెను; అప్పుడు ఆమెయు ఆమె సేవకులును తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.
ఏటేట సొలొమోనునకు వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పదిరెండు మణుగుల యెత్తు.
ఇదియు గాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్దనుండియు అరబి రాజుల యొద్దనుండియు దేశాధికారుల యొద్దనుండియు అతనికి చాలా వచ్చుచుండెను.
రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండువందల డాళ్లను చేయించెను; డాలు ఒకటింటికి ఆరువందల తులముల యెత్తు బంగారముండెను.
మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు మూడువందల కేడెములను చేయించెను; కేడెము ఒకటింటికి మూడువందల బంగారపు తులములయెత్తు బంగారముండెను; వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను.
మరియు రాజు దంతముచేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను.
ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను; సింహాసనము మీది భాగపు వెనుకతట్టు గుండ్రముగా ఉండెను; ఆసనమునకు ఇరుపార్శ్యముల యందు ఊతలుండెను; ఊతల దగ్గర రెండు సింహములు నిలిచియుండెను.
ఇరుప్రక్కల ఆరుమెట్లమీద పండ్రెండు సింహములు నిలిచియుండెను; అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు.
మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై యుండెను; లెబానోను అరణ్య మందిరపు పాత్రలును బంగారపువే, వెండిది యొకటియు లేదు; సొలొమోను దినములలో వెండి యెన్నికకు రాలేదు.
సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగియుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.
ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనముచేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడై యుండెను.
అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి.
ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.
మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చెను; అతడు వెయ్యిన్ని నాలుగువందల రథములును పండ్రెండువేల రౌతులును గలవాడై యుండెను; వీటిని అతడు రథములకై యేర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను ఉంచ నిర్ణయించెను.
రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుకచేసెను; దేవదారు మ్రానులను షెఫేలా ప్రదేశముననున్న మేడిచెట్లవలె విస్తరింపజేసెను.
సొలొమోనునకుండు గుఱ్ఱములు ఐగుప్తులోనుండి తేబడెను; రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగ కొని తెప్పించిరి.
వారు ఐగుప్తులోనుండి కొని తెచ్చిన రథమొకటింటికి ఆరువందల తులముల వెండియు, గుఱ్ఱమొకటింటికి నూట ఏబది తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీయుల రాజులందరికొరకును అరాము రాజులకొరకును వారు ఆ ధరకే వాటిని తీసికొనిరి.