పవిత్ర గ్రంథాలు

1రాజులు

అధ్యాయం 16

యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషానుగూర్చి యీలాగు సెలవిచ్చెను

నేను నిన్ను మంటిలోనుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా చేసితిని, అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు, ఇశ్రాయేలువారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై, వారి పాపములచేత నాకు కోపము పుట్టించియున్నావు.

కాబట్టి బయెషా సంతతివారిని అతని కుటుంబికులను నేను సమూల ధ్వంసముచేసి, నెబాతు కుమారుడైన యరొబాము సంతతివారికి నేను చేసినట్లు నీ సంతతివారికిని చేయబోవుచున్నాను.

పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును; బీడుభూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను.

బయెషా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు, అతని బలమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

బయెషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను.

మరియు బయెషా యరొబాము సంతతివారివలెనే యుండి తన కార్యములచేత యెహోవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టించిన దాని నంతటినిబట్టియు, అతడు తన రాజును చంపుటనుబట్టియు, అతనికిని అతని సంతతివారికిని విరోధముగ యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను.

యూదా రాజైన ఆసా యేలుబడిలో ఇరువదియారవ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.

తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సాయింట అతడు త్రాగి మత్తుడైయుండగా, యుద్ధ రథముల అర్ధభాగముమీద అధికారియైన జిమీ అతని మీద కుట్రచేసి లోపలికి చొచ్చి

అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువది యేడవ సంవత్సరమున సంభవించెను.

అతడు సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే బయెషా సంతతివారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగులనియ్యక అందరిని హతముచేసెను.

బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపముచేసి, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకులై, తాము పెట్టుకొనిన దేవతలచేత ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక

వారు చేసిన పాపములనుబట్టి ప్రవక్తయైన యెహూద్వారా బయెషానుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమీ బయెషా సంతతివారి నందరిని నాశనము చేసెను.

ఏలా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన క్రియలన్నిటినిగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

యూదా రాజైన ఆసా యేలుబడిలో ఇరువదియేడవ సంవత్సరమున జిమీ తిర్సాలో ఏడు దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా

జిమీ కుట్రచేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలువారందరును ఆ దినమున సైన్యాధిపతియైన ఒమీని దండుపేటలో ఇశ్రాయేలు వారిమీద రాజుగా పట్టాభిషేకము చేసిరి.

వంటనే ఒమీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరును తిర్సాకు వచ్చి దాని ముట్టడివేసిరి.

పట్టణము పట్టుబడెనని జిమీ తెలిసికొని, తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడ రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను.

యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై యుండి తానే పాపము చేయుచు, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను.

జిమీ చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన రాజద్రోహమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

అప్పుడు ఇశ్రాయేలువారు రెండు జట్లుగా విడిపోయి, జనులలో సగముమంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగముమంది ఒమీ పక్షమునను చేరిరి.

ఒమీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపువారిని జయింపగా తిబ్నీ చంపబడెను; ఒమీ రాజాయెను.

యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను.

అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండమీద పట్టణమొకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరునుబట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను1 అను పేరు పెట్టెను.

ఒమీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన పూర్వికులందరికంటె మరి దుర్మార్గముగా ప్రవర్తించెను.

అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెనో, దానిని అనుసరించి ప్రవర్తించెను.

ఒమీ చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు అగుపరచిన బలమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

ఒమీ తన పితరులతో కూడ నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను.

యూదా రాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలువారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఇరువదిరెండు సంవత్సరములు ఏలెను.

ఒమీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.

నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.

షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.

మరియు అహాబు దేవతాస్తంభమొకటి1 నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.