పవిత్ర గ్రంథాలు

అపోస్తలులకార్యములు

అధ్యాయం 25

ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడు దినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను.

అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యులును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి.

మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి.

అందుకు ఫేస్తు పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు; నేను శీఘ్రముగా అక్కడికి వెళ్లబోవుచున్నాను

గనుక మీలో సమర్థులైనవారు నాతో కూడ వచ్చి ఆ మనుష్యునియందు తప్పిదమేదైన ఉంటే అతనిమీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను.

అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొనిరమ్మని ఆజ్ఞాపించెను.

పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని బుజువు చేయలేకపోయిరి.

అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమునుగూర్చి గాని దేవాలయమునుగూర్చి గాని, కైసరునుగూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను.

అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను.

అందుకు పౌలు కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడియున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును.

నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకానియెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరము కాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.

అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదువని ఉత్తరమిచ్చెను.

కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి.

వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీయున్నాడు.

నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.

అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖాముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని

కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొనిరమ్మని ఆజ్ఞాపించితిని.

నేరము మోపినవారు నిలిచినప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు.

అయితే తమ మతమును గూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;

ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనో యేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింపబడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని.

అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపియుంచవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించువరకు నిలిపియుంచవలెనని ఆజ్ఞాపించితిననెను.

అందుకు అగ్రిప్ప ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను.

కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణమందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను.

అప్పుడు ఫేస్తు అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు వీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయుచు అతనిమీద నాతొ మనవి చేసికొనిరి

ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించియున్నాను.

ఇతనిగూర్చి మన యేలినవారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించియున్నాను.

ఖయిదీమీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుట యుక్తముకాదని నాకు తోచుచున్నదని చెప్పెను.