సంఖ్యాకాండము
అధ్యాయం 3
యెహోవా సీనాయి కొండమీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.
అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.
ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను.
నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రియైన అహరోను ఎదుట యాజకసేవ చేసిరి.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు లేవి గోత్రికులను తీసికొనివచ్చి
వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము.
వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసినదానిని, సర్వసమాజము కాపాడవలసినదానిని, వారు కాపాడవలెను.
మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని, వారే కాపాడవలెను.
కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు.
నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష నొందును.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా
ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొనియున్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.
ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిననాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.
మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారినందరిని లెక్కింపవలెను.
కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాటచొప్పున వారిని లెక్కించెను.
లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.
గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.
కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.
మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మాహలి మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.
లిబ్నీయులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.
వారిలో లెక్కింపబడినవారు అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందలమంది.
గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటిదిక్కున దిగవలెను.
గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు.
ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు
ప్రాకార యవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవ కొరకైన త్రాళ్లును.
కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీయుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.
ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరి లెక్కచూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధస్థలమును కాపాడవలసినవారైరి.
కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.
కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను.
వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.
యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడువారిమీద విచారణకర్త.
మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు.
వారిలో లెక్కింపబడిన వారెందరనగా, ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందలమంది.
మెరారీయుల పితరుల కుటుంబములో అబీహాయిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.
మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని
దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.
మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.
మోషే అహరోనులు యెహోవా మాటనుబట్టి, తమ తమ వంశములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము.
నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలొ తొలిచూలియైన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసికొనవలెను.
కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారినందరిని లెక్కించెను.
వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పై ప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండువేల రెండువందల డెబ్బదిమూడు.
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీయులు నావారైయుందురు; నేనే యెహోవాను.
ఇశ్రాయేలీయులకు తొలుతపుట్టిన వారిలో లేవీయులకంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.
పరిశుద్ధమైన తులముచొప్పున వాటిని తీసికొనవలెను.
తులము ఇరువది చిన్నములు. వారిలో ఎక్కువమంది విమోచనకొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను.
కాబట్టి మోషే లేవీయులవలన విడిపింపబడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను.
పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను.
యెహోవా మోషేకాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.